అమరావతి : ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పోలీస్స్టేషన్లో నిరసన తెలిపారు. నిన్న రాత్రి నుంచి కొనసాగిస్తున్న నిరసన ఇవాళ్టి వరకు కొనసాగింది. రాత్రి ఆయన పోలీస్స్టేషన్లోనే నిద్రించారు.
అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్యే సొంత గ్రామమైన గోపాలపురంలోని ఓ హోటల్లో ప్లేట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించడాన్ని స్థానిక యువకులు హోటల్ యజమానిని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురు రావులపాలెం పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడు, ప్లేట్లు విక్రయించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, యువకులు, వాట్సప్లో రెచ్చగొట్టేలా సందేశాలు పంపిన 18 మంది దళిత యువకులపై కేసు నమోదుచేసి రిమాండుకు పంపించారు. యువకుల అరెస్టుకు ఎమ్మెల్యే కారణమంటూ పుకార్లు వ్యాపించడంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే ప్లీనరీ నుంచి నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి అక్కడి పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ కేసులు నమోదు చేసిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేయాలని స్టేషన్లోనే బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి వచ్చిన డీఎస్పీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అక్కడే నిద్రించారు. ఇవాళ కూడా స్టేషన్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్లో ఎమ్మెల్యేను పరామర్శించారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.