YS Jagan | సీఎం జగన్పై దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడి రాయితో జరగలేదని.. ఎయిర్గన్తో జరిగినట్టు ఉందని అనుమానిస్తున్నారు. షార్ప్ షూటర్తో ఈ దాడిని ప్రతిపక్షాలు ప్లాన్ చేశాయని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు కురిపించారు.
జగన్పై జరిగింది రాళ్ల దాడి కాదని.. ఎయిర్గన్తో కాల్చినట్లు ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నుదుటిని టార్గెట్ చేసి కాల్చినట్లు ఉందని పేర్కొన్నారు. పెల్లెట్ వచ్చి కంటిపైన తగిలినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. పెద్ద ప్రమాదానికి ప్లాన్ వేశారని.. కానీ అదృష్టవశాత్తూ జగన్ బయటపడ్డారని అన్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత కావాలనే జగన్కు భద్రత తగ్గించారి అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది అని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్నికల కమిషన్ను విజ్ఞప్తి చేశారు.
షార్ప్షూటర్తో జగన్పై దాడి చేయించారని ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే టీడీపీ దాడి చేయించిందని ఆయన పేర్కొన్నారు. అదే రాయి కంటికి తగిలి ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. జగన్ భౌతికంగా ఉండకూడదనే ఈ దురాలోచన చేశారని మండిపడ్డారు.
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం చేతులు ముడుచుకుని ఉంటామని అనుకోవద్దని హెచ్చరించారు. మేం దాడి చేయాలనకుంటే.. చంద్రబాబు పలాస పొలిమేర దాటి వెళ్లగలరా? అని అన్నారు. అన్ని సందర్భాల్లో మేం సంయమనం పాటిస్తున్నామని అన్నారు. లేదంటే టీడీపీ నేతలు రోడ్ల మీద తిరగగలరా అని ప్రశ్నించారు.
సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. జగన్పై దాడి వెనుక పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ను చంపాలని పక్కా ప్లాన్తో కుట్ర జరిగిందని అన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే ఎన్నికల సమయంలో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రాళ్ల దాడి చేయాలని తుళ్లూరు సభలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. ఆ మాటలతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు సీఎం జగన్ను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రచార సమయంలో కదలికల వల్ల గురి తప్పి కంటికి తగిలిందన్నారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే జగన్ గాయంతో బయటపడ్డారని అన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టారనే కొన్ని వర్గాలు దాడి చేశాయని అన్నారు. తక్షణమే కేంద్రం జగన్కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.
జగన్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే దాడులకు పాల్పడుతున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్కు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోదని.. మరింత సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. జగన్ కన్ను పోగొట్టాలని ప్రతిపక్షాలు దాడి చేశాయని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సు యాత్రను అడ్డుకోవాలని కుట్ర పన్నారని విమర్శించారు. జగన్ను గన్లాంటి వెపన్తో షూట్ చేశారని ఆరోపించారు. ఘటనా సమయంలో భారీ శబ్దం వచ్చిందని.. తానే ప్రత్యక్ష సాక్షిని తెలిపారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు మేలు జరగడం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. సీఎం జగన్పై జరిగిన దాడి రాక్షస క్రీడ అని జోగి రమేశ్ అన్నారు. జగన్ ప్రచారం ఆగిపోవాలని కక్షతో చంద్రబాబు అండ్ కో చేసిన పని ఇదని మండిపడ్డారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీఎం జగన్పై రాళ్ల దాడిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. పవన్, చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. జగన్పై పవన్, చంద్రబాబు భాష అభ్యంతరకరమని పేర్కొన్నారు. కావాలని ఎవరైనా గాయాలయ్యేలా రాళ్లు విసిరించుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే కూటమి కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, లోకేశ్ విమర్శలు దుర్మార్గమని ఖండించారు.
జగన్పై దాడి పిరికిపంద చర్య అని ముద్రగడ పద్మనాభం అన్నారు. బస్సు యాత్రకు వస్తున్న స్పంద చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు దాడులకు తెగబడుతున్నానరని మండిపడ్డారు. దాడులు చేసే సంస్కృతి మంచిది కాదని హెచ్చరించారు.