YS Sharmila | ఏపీ సీఎం, వైసీసీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేసింది.. కేవలం జగన్ను విమర్శించడానికేనా? అని ఎద్దేవా చేశారు. దీనిపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చంద్రబాబు ట్రాప్లో పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ వల్ల ఓట్లు చీలే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లు సీఎం జగన్పై ఆరోపణలు చేస్తున్నారని షర్మిలను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి విమర్శలు చేశారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతగా షర్మిల చేసిన మాటల్ని పట్టించుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధిపై దేశమంతా చర్చ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటే జనం నమ్మరని స్పష్టం చేశారు.