Roja Selvamani | అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా సెల్వమణి ఘాటుగా స్పందించారు. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? అని వైఎస్ షర్మిలపై సెటైర్లు వేసింది. నిన్న మీ అన్న గారు రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్ మీద బురద జల్లుతున్నారని ఆగ్రహించింది.
2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? 2.14 పైసలకు ఎక్కడ అమ్మిందని వైఎస్ షర్మిలను రోజా నిలదీసింది. అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదని.. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయని తెలిపింది. అదానీతో ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదని స్పష్టం చేశారు. 2021 సెప్టెంబరు 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని తెలిపింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మనకు అంతకు ముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్.. అంటే ₹ 2.49 కే తమ మార్జిన్తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా అని నిలదీశారు.
గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, సోలార్ పవర్ ₹1.99కి కానీ, ₹2.10 కానీ వచ్చినా అది మన రాష్ట్రానికి ట్రాన్స్పోర్టు చేసే సరికే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ మరో ₹1.98 కూడా పడుతుందని రోజా తెలిపారు. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుందని.. ఈ విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. సెకీ మనకు ఇన్సెంటివ్గా, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ (ఐఎస్టీఎస్) మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ ₹2.49లకే వస్తోందన్నారు.
గుజరాత్లో యూనిట్ ₹1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు? ఎక్కడ కన్జూమ్ చేస్తున్నారన్నది చూస్తే మాన్యుఫాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్.. అమ్మే డిస్కంలు.. మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనే వాళ్లు.. అక్కడే మాన్యుఫాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టే వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీకు తెలియదా అని షర్మిలను రోజా ప్రశ్నించారు
ఇదే సెకీ, ఇదే ఆత్మ నిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్గఢ్కు కూడా ₹2.61కి అమ్మింది. విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గింది. వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారని నిలదీశారు.
చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్లు తిరుగుతాయి. పవన విద్యుత్ పీపీఏలు చూస్తే.. 2014–19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ₹4.84 నుంచి ₹4.83వరకు. 2014లో మాత్రం ₹4.70కి వచ్చింది. సోలార్కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఎలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున ₹6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో ₹5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50కి కొనుగోలు చేశారు. సోలార్ ఎనర్జీని యావరేజ్గా ₹5.90కి కొనుగోలు చేశారు.
మరి మా ప్రభుత్వం యూనిట్ ₹2.49కు కొంటే అది పెద్ద తప్పా? అది పెద్ద నేరమా? చంద్రబాబు యూనిట్ ₹5.90లకు కొంటే మంచివాడు.. జగన్ గారు ₹2.49లకు కొంటే చెడ్డవాడా? ఇదెక్కడి న్యాయం? అని రోజా ప్రశ్నించారు.
మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనాలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటి లక్ష్యం జగన్ అని షర్మిలను ఉద్దేశించి రోజా అన్నారు. మీరు కోరుకుంటున్నది జగన్ పతనమని అన్నారు. మీరు ఎన్ని కోరుకున్నా జగన్కు ప్రజలు అండగా ఉంటారని స్పష్టం చేశారు.