Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత పోతిన మహేశ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైందని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే వరదొచ్చినా, బురదొచ్చినా, ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం వైఎస్ జగనే అని మాట్లాడుతున్నారని విమర్శించారు.
కురుస్తున్న వర్షాలు తెలుసు.. కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగేవరకు అసలు ఏ ఏ వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ప్రభుత్వానికి తెలియలేదని పోతిన మహేశ్ విమర్శించారు. వరదకు ముందు చేయాల్సిన పనులు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలను శాంతి పరచడానికి ఆయన రోడ్ల మీద బోటుల్లో తిరుగుతున్నారని అన్నారు. అసలు ఆ బోట్లు రోడ్ల మీదకు రాకుండా ఆపలేకపోయినా తన చేతకానితనాన్ని తెలివిగా కప్పిపుచ్చుకుందామని అనుకున్నారని కూటమి పార్టీలపై మండిపడ్డారు.
టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా.. సొంత మీడియా వాడుకుని ఎంత ఎలివేషన్ ఇచ్చినా ప్రజల కోపం తగ్గలేదని.. అందుకే గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్లవని కొత్త కుట్ర ఎత్తుకున్నారని పోతిన మహేశ్ మండిపడ్డారు.10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని 5 బోట్లు అడ్డుకోగలవా అని ప్రశ్నించారు. ఎవరైనా బోట్లకి పార్టీ రంగులేసుకుని ప్రకాశం బ్యారేజ్ గేట్లు కి అడ్డంగా వదిలేయాలనుకుంటారా అని అడిగారు. ఇలాంటి 40 ఏళ్ల క్రితం రాజనాల సినిమా విలనిజం చేస్తే అర్థం చేసుకునే తెలివి జనానికి లేదా అని మండిపడ్డారు. అసలు మత్యకారులకు, బోట్ నిర్వాహకులకు ప్రభుత్వం సరైన సమాచారం ఇచ్చి వాళ్లను అప్రమత్తం చేస్తే ఈ రోజు బోట్లు కొట్టుకువచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా అని వ్యాఖ్యానించారు.
బుడమేరు వాగును, దానికి వస్తున్న ఇన్ఫ్లోను ముందే అంచనా వేస్తే ఈ రోజు 4 లక్షల మంది ప్రజల జీవితాలు ఛిద్రం కాకుండా ఉండేవని పోతిన మహేశ్ అన్నారు. అలాగే గొడుగు పట్టుకుని బుడమేరు కట్ట దగ్గర రీల్స్ చేసుకునే పరిస్థితి నిమ్మల రామానాయుడుగారికి రాకుండా ఉండేదని ఎద్దేవా చేశారు. క్రైసిస్ మేనేజ్మెంట్ లో నన్ను మించిన వారు లేరని మీ మీడియాలో ఊదర గొట్టే ముందు బుడమేరు క్రైసిస్ కి కారణం మీరే అని ఎప్పుడు గ్రహిస్తారని వ్యాఖ్యానించారు. ఏదో రకంగా వైసీపీని ఇబ్బంది పెట్టాలని వరదలో బురద ముంపులో మురికి రాజకీయం చేయాలని టీడీపీ నాయకులు తాపత్రయ పడుతున్నారు తప్ప అసలు ఈ ముంపుకు కారణం మాత్రం ప్రజలకు అర్థమైందని అన్నారు.
కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే వ్యక్తులను పోలీసులు తీసుకెళ్లి విచారణ పేరుతో వేధిస్తున్నారని పోతిన మహేశ్ అన్నారు. కోమటి రామ్మోహన్ తనకున్న బోట్లను నాలుగేళ్ల క్రితమే ఉషాద్రి అనే వ్యక్తికి విక్రయించారని తెలిపారు. ఉషాద్రికి ఏ పార్టీతో సంబంధం లేకున్నా వైసీపీకి చెందిన వారమని చెప్పాలని పోలీసులు ఒత్తిడి తీసుకొస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా నడుచుకుంటే సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు నిలబెడతామని అన్నారు. న్యాయపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేశారు.