Kethireddy Pedda Reddy | తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టుకు అనుమతించడం పట్ల వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందన్న ఆయన.. త్వరలోనే తాడిపత్రికి వెళ్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని.. సేవ చేస్తానని చెప్పారు.
తాను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించిందని కేతిరెడ్డి తెలిపారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కాపీలను ఎస్పీకి అందజేస్తానని చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తానని తెలిపారు.
కాగా, తనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని.. ఇటీవల కేతిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోలీసులే బందోబస్తు నడుమ తనను తాడిపత్రిలో దించాలని ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తనను అడ్డుకున్నారని కేతిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ చేపట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఈ సందర్భంగా కేతిరెడ్డి తరఫు న్యాయవాదులు సిద్ధార్థ్ దావే, పి.సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేశ్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ.. మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తాడిపత్రికి వెళ్లేందుకు అవసరమైతే ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకోవాలని సూచించింది. అలాగే అవసరమైన సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. పోలీసు సెక్యూరిటీకి అవసరమైన ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు అంగీకరించారు.ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.