అమరావతి : వైసీపీ పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఏపీలోని పలు జిల్లాలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయాల ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను, స్వీట్లను పంచిపెట్టారు. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఆ రోజు 12వ ఏట అడుగుపెడుతున్నామని తెలిపారు. ‘మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్సార్సీపీ 11వసంతాలు పూర్తిచేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 11ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో పార్టీని పదిలం చేశారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కేకులను కట్ చేసి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.