అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడి గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలోకి ఎందుకు వచ్చారని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ధూళిపాళ్లకు చెందిన కారు అద్దాలను, మీడియా కెమెరాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మట్టి తవ్వకాలు ఇష్టానుసారంగా చేస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పంచాయతీ అనుమతి ఉందని స్థానిక ఎంపీపీతో పాటు వైసీపీ నాయకులు తవ్వకాలు చేస్తూ అక్రమంగా విక్రయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. పల్లెల్లో టీడీపీ వారిపై దాడులకు పాల్పడుతూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టుతున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడితే ప్రతిదాడులకు తామూ సిద్ధంగానే ఉన్నామని హెచ్చరించారు. కళ్లెదుటే అక్రమాలు జరుగుతుంటే అడ్డుకోవడంపోయి వంత పాడడం సిగ్గుచేటని విమర్శించారు.