(Couple suicide) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ వివాహిత, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
బుధవారం ఏలూరు పవర్ పేట రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు అందించారు. రైల్వే పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో విచారణ ప్రారంభించారు. మహిళ మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి సమీపంలో యువకుడి మృతదేహం కూడా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతులు ఏలూరుకు చెందిన అరుణ కుమారి, రాజమండ్రికి చెందిన వినయ్గా గుర్తించారు. మృతురాలు మృతుడి కోడలు అని విచారణలో తేలింది. సదరు మహిళ లేఖ రాసి పెట్టి ఇంటి నుంచి వచ్చినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.