Vizag Steel | ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఓ క్రూరమైన చర్యగా భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన సభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్టీల్ప్లాంట్ రక్షణ బాధ్యత భారత రాష్ట్ర సమితిదేనన్నారు. రాజకీయ కుట్రలను అడ్డుకుని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. విశాఖలో చదువుకున్నానని, అప్పుట్లో స్టీల్ ప్లాంట్ ఉద్యమాలను కళ్లారా చూశానంటూ గుర్తు చేసుకున్నారు.
విశాఖలోనే గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేశానని, ఐఏఎస్గా ఎంపికైందని ఇక్కడి నుంచేనన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాల్లోకి నెట్టివేయబడిన సంస్థ, అలాంటి క్లిష్టమైన సమయంలో కార్మికులు కష్టపడి, చమటోడ్చి విశాఖ స్టీల్ప్లాంట్ ఆస్తులను రూ.3లక్షల కోట్లకు పెంచారన్నారు. కార్మికుల కష్టాన్ని కబ్జా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ప్లాంట్ను అదానీకి కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు పావులు కదుపుతోందని, ప్రజల ఆస్తులను ప్రైవేట్ శక్తులకు అప్పగించాలని మోదీ చూస్తున్నారని విమర్శించారు. ఇదేనా బీజేపీ సిద్ధాంతమంటూ ప్రశ్నించారు.
అదానీ బొగ్గు దిగుమతులకు స్టీల్ ప్లాంట్ భూములు కావాలని, గంగవరం పోర్టుని అదానీ దిగుమతుల కోసం ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్పైనా అదే కుతంత్రాన్ని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ప్లాంట్కు రూ.5 వేలకోట్లు ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదా? అంటూ నిలదీశారు. కేంద్ర బడ్జెట్ రూ.45లక్షల కోట్లని, అందులో రూ.5వేల కోట్ల సాయం విశాఖకు కేంద్రం చేయలేదా? అని నిలదీశారు. కనీసం రుణమైనా ఇవ్వాలని, కేంద్రం ఇచ్చిన రుణాన్ని వడ్డీతో సహా విశాఖ స్టీల్ప్లాంట్ తీరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్ ఆస్తులే ప్లాంట్కు శ్రీరామ రక్షని, అందుకే నిర్వాసితులు ఇచ్చిన భూముల్ని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణలో వైసీపీతోపాటు మిగితా రాజకీయ పక్షాలు చేతులెత్తేశాయని, అందుకే ఆ బాధ్యతను బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు భుజానికెత్తుకున్నారన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమానికి కేసీఆర్ అండగా నిలవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని, ఆయన వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారన్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్లాంట్కి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.