Chandrababu | గత వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అని తెలిపారు. నిర్వీర్యమైన వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. వినతులు అన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రికార్డులను కూడా తారుమారు చేశారని పేర్కొన్నారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు తెలిపారు. రెవెన్యూ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు.
భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తామని చెప్పారు. వినతులు ఇచ్చేందుకు అమరావతి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. తన పర్యటనల వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా మార్పులు తెస్తామని అన్నారు.