నెల్లూరు: త్వరలో క్యాబినెట్ను విస్తరించనున్నట్లు ఏపీ సీఎం జగన్ ఇటీవల తన మనుసులోని మాటను బయటపెట్టడంతో ఆశావహులు ఎవరికి వారు జోరుగా పైరవీలు చేసుకుంటున్నారు. తమకు ఈ పాటికే అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని గుళ్లు, గోపురాల్లో కొందరు పూజలు చేస్తుండగా.. మరికొందరేమో ఎప్పుడో తమకు మాటిచ్చారని అనుచరుల వద్ద ఇంకొందరు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీనియర్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తారా, లేదా.. అని రాజకీయ విశ్లేషకులు అయోమయం చెందుతున్నారు. 2019 లో నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను క్యాబినెట్లోకి తీసుకోవడంతో కాకాణికి అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు
మేకపాటి గౌతంరెడ్డి పేరు తెరపైకి రావడంతో మరోసారి మొండిచేయి చూపినట్లయింది. కాగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో క్యాబినెట్ బెర్త్ ఖాళీ అయింది. ఈ ఖాళీని భర్తీ చేయడంలో తనకు అవకాశం లభిస్తుందన్న ఆశతో కాకాణి ఉన్నారు. కాకాణి గోవర్ధన్ చాలా కాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం జిల్లా వైసీపీ కన్వీనర్గా ఉన్నారు. ఈసారి కాకాణికి మంత్రిగా అవకాశం ఇస్తే పార్టీ క్యాడర్కు ప్రోత్సాహం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణరెడ్డికి మంచి అనుభవం ఉన్నప్పటికీ గతంలో ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఆయన కూడా క్యాబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గం నుంచి ఏడుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో తీసుకోవాలని జగన్ భావిస్తే.. నెల్లూరు నుంచి ఒక్కరికే అవకాశం వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. రామనారాయణరెడ్డి, గోవర్ధన్రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందని వారంటున్నారు. ఇలాఉండగా, మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తిని ఆత్మకూర్ నుంచి గెలిపించి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.