అమరావతి : పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం సూచించడం ప్రశంసనీయమని పేర్నొన్నారు. ఈమేరకు ఇవాళ తన ట్విటర్లో పెట్రో ధరలను తగ్గించని ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇప్పటికే కేంద్రం పెట్రోల్పై రూ. 8లు, డీజిల్పై రూ.6లు పన్ను తగ్గించిందని, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయని గుర్తు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఎందుకు పన్నులు తగ్గించడం లేదని, ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.పెట్రో పన్ను తగ్గించి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ప్రజలు భారం మోయలేక పోతున్నా ప్రభుత్వం మాత్రం పెట్రో బాదుడు నుంచి ఉపశమనం కలిగించడం లేదని ఆరోపించారు. పెట్రో ధరల బాదుడుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణం అవుతుందని పేర్కొన్నారు.
తమ హయాంలో అభివృద్ధిలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది ..ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు.