Jagan | చంద్రబాబు మోసాలు భరించలేక.. ప్రజలు ఐదేండ్ల క్రితమే చొక్కా మడతేశారని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాప్తాడులో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుర్చీలు మడిచి 23 సీట్లకు తగ్గించారని.. మరోసారి చొక్కా మడతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి.. గ్లాసు సింకులో ఉండాలని సెటైర్ వేశారు.
చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకమేనని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే మేనిఫెస్టోలని 90 శాతం హామీలను అమలు చేశామని.. మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదని నిలదీశారు. అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. జగన్కు ప్రజాబలం లేకపోతే చంద్రబాబుకు పొత్తులెందుకు అని అన్నారు. సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు అని ప్రశ్నించారు. జగన్ పాలన కొనసాగాలంటే ప్రజలు రెండు బటన్లు నొక్కాలని సూచించారు. పొరపాట్లు చేస్తే చంద్రముఖి మళ్లీ బయటకొస్తుందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైసీపీ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోందని తెలిపారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఇన్ని మంచి పనులు చేశామని.. మరోసారి ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రతి కుటుంబం మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని సూచించారు. అందులో ఒకటి అసెంబ్లీకి.. రెండో బటన్ పార్లమెంట్కు అని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ప్రజలకు చంద్రముఖి బెడద ఇక ఉండదని అన్నారు.
మరో 55 రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయని జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175 సీట్లు మన టార్గెట్ అని పేర్కొన్నారు. 25 ఎంపీ సీట్లకు 25 మన టార్గెట్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ సైన్యంగా పనిచేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు కనిపించవని తెలిపారు.