YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు.. ఆరోగ్యశ్రీపై మీకు ఎందుకింత కక్ష అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని నిలదీశారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారు? కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు? అని నిలదీశారు.
అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్య శ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టుపెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైయస్సార్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలను స్కాంచేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదంటారా? అని ప్రశ్నించారు.
ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా అని చంద్రబాబును వైఎస్ జగన్ను ఉద్దేశించి అన్నారు. మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యమని ప్రశ్నించారు. కొవిడ్ వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమందిని కాపాడుకుందని తెలిపారు. ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుందని పేర్కొన్నారు. మరి ప్రైవేటు కంపెనీలు ఈ పని చేయగలవా? మీరు చేయించగలరా? అనిప్రశ్నించారు. విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా? ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏంటని నిలదీశారు.
నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు.. కాని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అని చంద్రబాబును జగన్ను ప్రశ్నించారు. ఏ రోజైనా ఆ ప్రయత్నంచేశారా? పోనీ దివంగత మహానేత వైయస్సార్ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతంచేసేలా ఒక్కపనైనా చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1,000 నుంచి 3,257కి పెంచామని అన్నారు. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా సంవత్సరాదాయం రూ.5లక్షలలోపు ఉన్న వారికి కూడా వర్తింపచేసి మధ్యతరగతి వారికీ మేలు చేశామని తెలిపారు. రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేశామన్నారు. ఐదేళ్లకాలంలో 45.1లక్షల మందికి రూ.13,421 కోట్లు ఖర్చుచేసి ఉచితంగా వైద్యాన్ని అందించామని చెప్పారు. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంటుకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి, దానికింద మరో రూ.1,465 కోట్లు అందించి రూ. 24.59 లక్షల మందికి ఆరోగ్య ఆసరాగా నిలిచామన్నారు. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారని చెప్పారు. కొత్తగా అంబులెన్స్లు తీసుకొచ్చి 104,108 సేవలను మేం మెరుగుపరిస్తే, మీరు నెలల తరబడి బకాయిలుపెట్టి ఆ అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారని తెలిపారు.
బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టారని జగన్ తెలిపారు. తీరా అధికారంలోకి వచ్చాక మీర్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఇచ్చిన హామీలను ఎలాగూ ఎగరగొడుతున్నారని విమర్శించారు. మేం ఇచ్చిన పథకాలనూ రద్దుచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారని పేర్కొన్నారు. ప్రజలకు నష్టం చేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు.