అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ( YS Sharmila) ఆదివారం విజయవాడలోని కానూరులోని కల్యాణ మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ ప్రభుత్వం, టీడీపీ చంద్రబాబు గత పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ వీడిపోయినప్పుడు ఏపీకి లక్ష కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు పాలనలో రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని విమర్శించారు.
వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తరువాత మరో 6న్నర లక్షల అప్పులు చేసి మొత్తం 10 లక్షలకు పైగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. చేసిన అప్పులతోనైనా అభివృద్ధి జరుగలేదని, చంద్రబాబు, వైఎస్ జగన్ (YS Jagan) దోచుకోవడం.. దాచుకోవడం లాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మూడు రాజధానులన్నారు. ఒక్కటైనా లేకుండా చేశారని ఆమె వ్యాఖ్యనించారు.
10 సంవత్సరాలలో ఏపీలో ఎక్కడా కూడా ఒక్క మెట్రో( Metro train ) లేదని, రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ రాలేదని ఆరోపించారు. రాష్ట్రానికి కనీసం రోడ్లు వేసింది లేదని పేర్కొన్నారు. ఎక్కడా చూసిన ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియానేనని వివరించారు.
ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు ?
టీడీపీ, వైసీపీ ప్రత్యేక హోదా (Special Status) సాధించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ బీజేపీతో పెట్టుకుని కేంద్ర మంత్రులయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్జగన్ స్పెషల్ స్టెటస్ కోసం దీక్షలు చేశారు. సీఎం అయినా తరువాత ఒక్కసారైనా జగన్ నిజమైనా ఉద్యమం చేయలేదని అన్నారు. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ ఎంపీలు, 6 గురు రాజ్యసభ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు.