అమరావతి : ఇంటర్ ఫలితాలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) అధికారులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల (Supplementary Fees) ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్ (Reverification), రీ కౌంటింగ్ కోసం ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు.
ఒక్కో పేపర్ జవాబు పత్రం రీ వెరిఫికేషన్కు రూ.1300, ఒక్కో పేపర్ రీకౌంటింగ్(Recounting) కు రూ.260 చెల్లించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ తమ కాలేజీల్లోని ప్రిన్సిపల్స్ను సంప్రదించాలని వెల్లడించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నామని ఇంటర్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.