అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రోజుకో వర్గం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సమాజంలో చైతన్య స్ఫూర్తిని నింపే నాటక, సినీ రంగాలపై కక్ష పెట్టుకున్న విధంగా వ్యవహరిస్తుండడంతో ఈసారి నాటక రంగ కళాకారులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని దశాబ్దాలుగా పల్లెలు, పట్టాణాల్లో అలరిస్తున్న ‘ చింతామణి’ అనే నాటకంలో నవ్వులతోపాటు సందేశాత్మక విషయాలు ఉన్నప్పటికీ ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని ఆర్యవైశ్య సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాటకాన్ని నిషేధించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో వందేళ్ల చరిత్ర, లక్షల ప్రదర్శనల చరిత్ర ఉన్న ‘చింతామణి’ నాటక ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధిస్తూ ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది . వేశ్యల కారణంగా కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయి. ఎంతగొప్పవారైనా… ఏ విధంగా రోడ్డునపడతారు? అనే అంశాల కథే చింతామణి నాటకం.
ఈ నాటకంలో అశ్లీలత ఉందన్న ఆరోపణలతో వివాదాలు జరిగాయి. కోర్టు కేసుల వరకు వెళ్లిన తర్వాత.. అశ్లీల సంభాషణలు తొలగించడంతోపాటు… కొన్ని పాత్రల పేర్లు మార్చి ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ నాటకాన్ని పూర్తిగా నిషేధించాలని ఒత్తిళ్లు చేయడంతో ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులిచ్చింది .
నాటక రంగం అంతరిస్తున్న తరుణంలో నాటకరంగాన్ని ప్రోత్సహించాల్సిందిపోయి నిషేధం విధించడం పట్ల కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో కళాకారులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చింతామణి నాటకం నిషేధాన్ని ఎత్తివేయాలని ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని కళాకారులు కోరుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తూ సుమారు 35 వేల మంది కళాకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు.