అమరావతి : ఆంధ్రప్రదేశ్లో లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలులో ఇవాళ బహిరంగ సభలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన సున్నా వడ్డీ పథకం కోసం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం బటన్ నొక్కి జమచేశారు.
ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ గడిచిన మూడేళ్లలో రూ. 3,165 కోట్లను రుణం కింద చెల్లించామని దీనివల్ల కోటి 2లక్షల 16 వేలమందికి మేలు కలిగిందని వివరించారు. గతంలో 12శాతం దాకా వడ్డీలు చెల్లించి నష్టపోయిన మహిళలలకు తాము సున్న వడ్డీ కింద రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఇటీవల 70 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని, ఐదు డిప్యూటీ సీఎంలుంటే మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలనే కొనసాగించామని వెల్లడించారు.
కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వ పథకాల వల్ల పేదలకు న్యాయం జరుగుతుంటే ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఏటా రూ.2వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.