శ్రీశైలం : క్షేత్రానికి వచ్చే భక్తులకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించడం చట్టపరంగా నేరమని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం క్షేత్ర పరిధిలో తూనీకలు కొలతలు మరియు ఫుడ్సేఫ్టీ అధికారులు విస్తృతంగా పర్యటించి, పలువ్యాపార సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థానం పరిధిలో ప్రతి దుకాణదారుడు తాము విక్రయించే వస్తువుల ఎమ్మార్పీ ధరల పట్టికను తప్పనిసరిగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
అదే విధంగా హోటళ్లు, ఫుడ్కోర్టు, టిఫిన్ సెంటర్లు, తోపుడుబండ్లు, రెస్టారెంట్లు, టీస్టాల్స్ వంటి వ్యాపారం చేసుకునే వారు కూడా నాణ్యమైన ఆహారపు పదార్థాలను మాత్రమే వినియోగించాలని హెచ్చరించారు. అదే విధంగా ప్రధాన కూడళ్లలోని పలు వ్యాపారస్తులు అధిక ధరలకు విక్రయిస్తుండగా సుమారు 18 దుకాణాలకు రూ.3వేల నుంచి రూ.10వేల వరకు జరిమానాలు విధించినట్లు తూనికలు కొలతల శాఖ అధికారులు వెల్లడించారు.
అదే విధంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆలయ పరిధిలోగల దుకాణాల వారికి అధిక ధరలకు విక్రయించవద్దని పలుమార్లు తాకీదులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ సూచనలు నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం కనబరిచిన వారి వృత్తివ్యాపార లైసెన్సులు రద్దు చేయ్యనున్నట్లు పేర్కొన్నారు. వినియెగదారులు తాము నష్టపోతున్నామని భావించినప్పుడు 9121101192, 9121101193 నంబర్లకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.