తిరుపతి జిల్లా : ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని చెప్పారు. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని, అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నామని పేర్కొన్నారు. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలపై నారా లోకేష్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై, తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న నారా లోకేష్కు అభివృద్ధి కనపడటం లేదంటే ఆయన నేత్ర వైద్యుడ్నిసంప్రదిస్తే మంచిదని మంత్రి రోజా సలహా ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్ని సర్వేలు చెప్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంబానీ, అదానీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుండగా.. టీడీపీ మాత్రం ప్రజల మనసుల్ని దోచుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లే పనిలో నిమగ్నమై ఉన్నదని ఎద్దేవా చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై కూడా మంత్రి రోజా సీరియస్ కామెంట్లు చేశారు. అమావాస్యకో, పౌర్ణమికో నియోజకవర్గానికి వచ్చి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలపై బాలకృష్ణ గతంలో ఎన్నో మాట్లాడారని, మరి ఆ రోజుల్లో బాలకృష్ణను ఎందుకు పార్టీ నుంచి సస్పండ్ చేయలేకపోయారని ప్రశ్నించారు. మంత్రులకు ఏ అధికారాలు ఉన్నాయో మమ్మల్ని అడిగితే తెలుస్తుందన్నారు.