అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటిని పరిశీలించి అప్పిళ్లకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని భావించడం లేదని వివరించారు. రాష్ట్రప్రభుత్వం మూడు ప్రాంతాలు, 13 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. అయితే కోర్టును పూర్తిగా పరిశీలించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రప్రజలకు ఏది మంచి జరుగుతుందో అదే విధంగా ముందుకు వెళ్తుతుందన్నారు.
చంద్రబాబు చెప్పినట్లు జరగదని అన్నారు. అమరావతి భూముల అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్నారు. రాజధాని రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేస్తే తప్పా ఈ ప్రభుత్వం రైతులకు మోసం, అన్యాయం చేయదని అన్నారు. రైతుల ముసుగులో ప్రతిపక్ష నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును ఈరోజు వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధాని రైతులకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలను వెల్లడించింది. సీఆర్డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది.
రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది.