అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించకుండా హుందాగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే సభకు వెళ్లబోమని స్పష్టంచేశారు. అసెంబ్లీలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. అవమానాలు ఎదుర్కొన్నా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. మూడేండ్లలో సభ సజావుగా సాగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, తమ కర్తవ్య బాధ్యతలను నెరవేర్చడానికే సభకు హాజరవుతున్నామని తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ పనులను కొనియాడుతూ, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అభిప్రాయపడ్డారు. మరోవైపు, గవర్నర్ ప్రసంగంపై టీడీపీ నేతలు అసెంబ్లీలో నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకాలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు.
సభ నుంచి వాకౌట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వరని అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లబోమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం బయట చేసే ప్రకటనలకు, సభ లోపల వ్యవహరించే తీరుకు పొంతన ఉండటం లేదని అన్నారు. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన అచ్చెన్నాయుడు.. హైదరాబాద్ నుంచే పాలించండి.. ఎవరొద్దన్నారు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.