అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో ఏపీ మంత్రివర్గమంతా రాజీనామాలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కంటే కూడా పార్టీ కోసం సేవలందించాలని సూచించిన మేరకు తామంతా కట్టుబడి రాజీనామాలు చేశామన్నారు. అనుభవం రీత్యా మంత్రివర్గంలో ఉన్న వారిలో 5,6 గురు మాత్రమే ఉంటారని సీఎం వెల్లడించారని వివరించారు.
11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. తమ కంటే ఎక్కువగా సీఎం జగన్ బాధపడ్డారని అయితే తామంతా జగన్కు మద్దతుగా ఉంటామని ధీమాను కల్పించామని చెప్పారు. తమ నాయకుడి కోసం తాను ఎలాంటి పదవులు చేపట్టడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ తీసుకునే నిర్ణయాలు సామాన్యమైనవి కావని అన్నారు. కొనసాగే మంత్రుల పేర్లు ప్రకటించలేదని తెలిపారు.
మంత్రుల రాజీనామా కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని సీఎంగా బాధ్యతలు తీసుకున్న రోజునే రెండున్నర సంవత్సరాల తరువాత రాజీనామాలు చేయాల్సి ఉంటుందని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రులు రాజీనామా చేసిన అనంతరం తమ సొంత వాహనాల్లో బయటకు వెళ్లిపోయారు.