అమరావతి : టీడీపీకి చెందిన ఓ నేత కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు చంద్రబాబును గాని, ఆయన కుటుంబంపై గాని చెత్తవాగుడు వాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తాము వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేసుకుంటున్నామని , ఈ బ్యాచ్ చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని అన్నారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు పిచ్చివేషాలు మానుకోవాలని, నోరు అదుపులోకి పెట్టుకోవాలని అన్నారు. చంద్రబాబును తిడితే, కార్యాలయాలపై దాడులు చేస్తే వైసీపీ నాయకులకు పదవులు వస్తాయని భావిస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు.