అమరావతి : ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో మూడు రాజధానులు తప్పవని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి స్పష్టం చేశారు. గుడివాడలో జగనన్న గృహహక్కు పథకం ప్రారంభంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టిన రాజధాని అమరావతి అని విమర్శించారు. విశాఖలో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయక తప్పదు.. అమరావతికూడా ఇందులో ఉంటుందని వెల్లడించారు.
అమరావతి అందరిదీ అన్న పెద్దలు, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అమరావతి ఏర్పాటు చేయాలని నాడు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన విషయానికి బహిరంగ చర్చకు తాను సిద్ధమని టీడీపీ నాయకులకు సవాలు విసిరారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అసత్యప్రచారాలు నమ్మొద్దని ప్రజలను కోరారు.