తిరుమల : తిరుమల కొండపైన ఏనుగుల సంచారం కలవరం రేపుతుంది. కొన్ని రోజులుగా తిరుమల పార్వేటి మండపం వద్ద ఏనుగులు సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా పార్వేటి మండపం వద్ద రోడ్డుపై ఏనుగుల గుంపు నుంచి దారి తప్పిన మరో ఏనుగు అటు ఇటూ కలియ తిరిగింది. కోపంతో చెట్ల కొమ్మలను ధ్వంసం చేసింది. ఈ విధ్వాంసాన్ని చూసిన భక్తులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అటవీశాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఏనుగును దారి మళ్లించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఏనుగుల సంచారంతో పాపవినాశనం, ఆకాశగంగ, జాపాలి తీర్థాలకు వెళ్లే వాహనాలను టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ సిబ్బంది గంటపాటు అనుమతించలేదు.