Vizag Zoo : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం విశాఖపట్నం (Vishakhapatnam) లోని ఇందిరాగాంధీ (Idiragandhi) జంతు ప్రదర్శనశాల కొత్త కళను సంతరించుకుంది. సందర్శకులను మరింత ఆకట్టుకునేందుకు గుజరాత్ (Gujarat) నుంచి అరుదైన, విదేశీ జంతువులు ఇక్కడికి చేరుకున్నాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా జీబ్రాలు (Jeebra), రెడ్ నెక్డ్ వాలీ (Red Necked Vally) లతో పాటు ప్రత్యేకమైన కోతి జాతులను విశాఖకు తీసుకొచ్చారు. ఈ కొత్త జీవుల రాకతో జూలో సందడి వాతావరణం నెలకొంది.
జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఈ కొత్త జీవాలను విశాఖకు తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్ జి మంగమ్మ తెలిపారు. వచ్చిన వాటిలో ఒక మగ, రెండు ఆడ జీబ్రాలు.. ఒక మగ, రెండు ఆడ రెడ్ నెక్డ్ వాలీలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. వీటితోపాటు రెండు జతల కాటన్ టాప్ టామరిన్ కోతులు, ఒక మగ, రెండు ఆడ కామన్ మార్మోసెట్ కోతులు కూడా ఉన్నట్లు తెలిపారు.
ఈ మార్పిడిలో భాగంగా విశాఖ జూ నుంచి ఒక జత ఇండియన్ గౌర్ (అడవి దున్న), రెండు జతల స్టంప్ టైల్డ్ మకావ్ కోతులు, ఒక జత ఘారియల్ మొసళ్లను గుజరాత్కు పంపించారు. వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో ఈ జంతువులను సురక్షితంగా విశాఖకు చేర్చామని, ప్రస్తుతం వీటిని క్వారంటైన్లో ఉంచామని మంగమ్మ తెలిపారు. క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత సందర్శకుల వీక్షణ కోసం వాటికి కేటాయించిన ప్రత్యేక ఎన్క్లోజర్లలోకి విడుదల చేస్తామని వెల్లడించారు.
ఇదిలావుండగా ఇటీవలి కాలంలో విశాఖ జూలో జంతు సంపద గణనీయంగా పెరిగింది. 12 రకాల జాతులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మించినట్లు అటవీ శాఖ అధికారికంగా ప్రకటించింది. వీటిలో 40 స్టార్ తాబేళ్లు, 35 అడవి పందులు, 20 చుక్కల జింకలు, సాంబార్ జింకలు, హైనాలు, బైసన్లు వంటివి ఉన్నాయి. ఈ పరిణామంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హర్షం వ్యక్తంచేశారు. ఈ కొత్త జంతువుల రాక, ఇటీవల జన్మించిన జీవాలతో విశాఖ జూ సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని పంచనుంది.