Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు దేశం పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై అధికారిక వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్లు టీడీపీ నాయకుల బంధువులే అంటూ ఆధారాలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుతో చంద్రబాబు, లోకేశ్, పురంధేశ్వరితో పాటు టీడీపీ నేతల హస్తం ఉందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికే టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ను తెప్పించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అవాస్తవాలతో వైసీపీ పార్టీపై చంద్రబాబు చేసిన ట్వీట్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
వైజాగ్లో పట్టుబడ్డ డ్రగ్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఏపీ కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పించుకోవడానికే తమపై నిందలు వేస్తున్నారని సీరియస్ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సంబంధించిన గ్యాంగ్ ఈ కేసులో ఉందని తమకు అనుమానం ఉందని సజ్జల అన్నారు. టీడీపీ నేతల బంధువులు, కుటుంబసభ్యులు ఉన్నట్లు కూడా కనిపిస్తుందని.. ఇది కచ్చితంగా టీడీపీ నాయకుల పనే గట్టిగా అనుమానిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ కేసులో దొంగే దొంగ దొంగ అన్నట్లుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గుమ్మడి కాయ దొంగలెవరూ అని అంటే భుజాలు తడుకుమున్నట్లుగా చంద్రబాబు, లోకేశ్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే లోకేశ్ కూడా ట్వీట్లు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. డ్రగ్స్ వాడకాన్ని తగ్గించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వాళ్లు తప్పించుకోవడానికే తమపై బండలు వేస్తున్నాని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నారో తేల్చాల్సిందేనని అన్నారు.
మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పిస్తే జగన్పై ఆరోపణలు చేయమేంటని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఓటర్లకు పంచేందుకు డ్రగ్స్ తెచ్చినట్టు అనుమానంగా ఉందని అన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, డ్రగ్స్ కేసులో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారని ఏపీ మంత్రి కాకాని విమర్శించారు. దాన్ని కూడా వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.