హైదరాబాద్, మార్చి 10 ( నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను ఎదురొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆయన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగులను, సీఎఫ్ఎస్ఎల్ నివేదికలను సీల్డ్కవర్లో సోమవారంలోగా తమకు అందజేయాలని సీబీఐకి స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులను జారీచేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరును తప్పుపడుతూ ఎంపీ అవినాశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. తనపై కఠిన చర్యలు చేపట్టకుండా సీబీఐని నిరోధించాలని ఆయన చేసుకున్న విన్నపంపై జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. తొలుత అవినాశ్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. సీబీఐ దర్యాప్తు తీరు పట్ల పలు అనుమానాలున్నాయని, విచారణను వీడియోలో చిత్రీకరిస్తున్నదా? లేదా? అన్న దానిపై కూడా సందేహాలున్నాయని తెలిపారు.
వివేకా హత్య జరిగిన చోట లభ్యమైన లేఖ ఏమైందో తెలియడం లేదని చెప్పారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. అవినాశ్ వాంగ్మూలాన్ని వీడియోలో చిత్రీకరించామని, వివేకా హత్యా స్థలంలో లభ్యమైన లేఖపై సీఎఫ్ఎస్ఎల్ అభిప్రాయాన్ని తీసుకున్నామని వివరించారు. అవినాశ్ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో హార్డ్డిస్క్లను సీబీఐ ఎస్పీ స్వయంగా కోర్టుకు తీసుకొచ్చారని పేర్కొంటూ.. ఈ కేసులో అవినాశ్ను, ఆయన తండ్రి భాసర్రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో ఈ నెల 13 వరకు అవినాశ్ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా, అవినాశ్ తన పిటిషన్లో వివేకా కుమార్తె డాక్టర్ సునీత పేరును ప్రస్తావించడంతో ఈ వ్యవహారంలో తన వాదన వినిపించేందుకు అనుమతించాలని ఆమె ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సునీత విన్నపంపై అభ్యంతరమేమైనా ఉంటే తెలపాలని హైకోర్టు సీబీఐకి సూచించింది.
వివేకా హత్యపై శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపిం ది. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న నిం దితులు సునీల్కుమార్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డితోపాటు బెయిల్పై బయట ఉన్న గంగిరెడ్డి ఈ విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా పడటంతో ముగ్గురు నిందితులను మళ్లీ చంచల్గూడ జైలుకు తరలించారు.