విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 500 రోజుల మార్క్కు చేరుకున్నది. విశాఖ ఉక్కు ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా ఉండేందుకు వీఎస్పీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు గత ఏడాదిన్నరకుపైగా కాలంగా పోరాడుతున్నారు. మరోవైపు వీరికి లొంగకుండా కేంద్రం తన ప్రయత్నం తాను చేస్తున్నది. విశాఖ ఉక్కు ఉద్యమం 500 రోజులకు చేరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే సూచనలు మాత్రం కనిపించడం లేదు. విశాఖ ఉక్కు ప్లాంటును అమ్మేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ (వీయూపీపీసీ) ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఇలాఉండగా, ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఢిల్లీలో లావాదేవీల సలహా కమిటీ, న్యాయ సలహా కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు 500 రోజులకు చేరిన సందర్భంగా కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్మిక సంఘాలు ఆదివారం పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. గతంలో కూడా వీయూపీపీసీ ప్రతినిధులు, వీఎస్పీ ఉద్యోగులు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు. కోటి సంతకాల ప్రచారం, పాదయాత్రలు, ర్యాలీలు, రాష్ట్రవ్యాప్త బంద్లు, రిలే నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, రాస్తారోకోలు చేపట్టి తమ నిరసనను వ్యక్తపరిచాయి. వీరి ఆందోళనలకు అధికార వైసీపీ కూడా మద్దతు తెలిపింది.
కూర్మన్నపాలెం జంక్షన్లో ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న ప్రారంభమైన రిలే నిరాహారదీక్షకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన పలువురు నాయకులు తరలివచ్చి మద్దతు తెలిపారు. అయితే, వారి విజ్ఞప్తులను కేంద్రం పెడ చెవిన పెట్టింది. గతంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కి కేటాయించిన రాబోడిహ్ బొగ్గు గనుల రద్దుకు ముందుకొచ్చింది. వీఎస్పీకి చెందిన ఉద్యోగులు, యూనియన్ నాయకులు తమ పోరాటాన్ని కొనసాగిస్తుండగా, కేంద్రం కూడా ప్రైవేటీకరణ చర్యతో మరింత ముందుకు సాగుతున్నది. కేంద్రం మొడలు వంచేందుకు మున్ముందు వీరి ఉద్యమం ఎలా కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.