అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై లోక్సభలో కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ కార్మిక సంఘాల నాయకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విశాఖ స్టీల్ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ప్లాంట్ చరిత్రను కించపరిచే విధంగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం కార్మికులందరూ వ్యతిరేకించాలని నాయకులు కోరారు. కేంద్రమంత్రి దేశప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్పరిశ్రమలకు బొగ్గును కేటాయిస్తున్న కేంద్రం విశాఖకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈనెల 28న ఇచ్చిన విశాఖ బంద్ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.