అమరావతి : విశాఖ నగరంలో సంచలనం కలిగించిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం మధురనగర్లోని ఓ ఇంటి వాటర్ డ్రమ్లో మహిళ మృత దేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధనలక్ష్మిగా గుర్తించారు . రిషి అనే వ్యక్తి మహిళను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా లభించిన సమాచారం వివరాలను నగర సీపీ వెల్లడించారు.
గతంలో శ్రీకాకుళం బస్టాండ్లో రిషి, ధనలక్ష్మి మధ్య పరిచయం ఏర్పడిందని దీంతో ఆమెను మధురవాడలోని తన నివాసానికి తీసుకెళ్లాడని తెలిపారు. కొన్నాళ్ల తర్వాత రిషిని ఆమె డబ్బులు డిమాండ్ చేయడంతో తమ విషయం అందరికీ తెలుస్తుందని ఆమెను చున్నీతో హత్య చేశాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా పకడ్బందీగా ప్లాస్టిక్ కవర్లో చుట్టి ప్లాస్టిక్ డ్రమ్లో ఉంచి ఇంటికి తాళం వేసి వెళ్లాడు.
ఇంటి యజమాని అద్దె కోసం పలుమార్లు రిషిని అడగగా పుట్టింటికి వెళ్లిన తన భార్య వచ్చాక ఇంటి అద్దె చెల్లిస్తానని బుకాయించాడు. ఏడాదిగా అద్దె కట్టకపోవడంతో ఖాళీ చేయించేందుకు ఇంట్లోకి వెళ్లిన యజమాని ప్లాస్టిక్ డ్రమ్లో ఉన్న మృతదేహాన్నిగుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు రాబడతామని సీపీ వెల్లడించారు.