తిరుమల : ఈనెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను (VIP break darshans ) టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో ( Tirumala ) సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02వ తేదీ వరకు జరుగనున్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) సందర్భంగా సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని సంబంధిత అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. తమిళంలో కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే ‘భక్తుడు’ , తిరు అంటే ‘ శ్రేష్ఠo’, మంజనం అంటే ‘స్నానం ’ మని అర్థమని అన్నారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమమని పేర్కొన్నారు.
శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారని వివరించారు. అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భగుడి నుంచి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన ‘పరిమళం’ అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారని వెల్లడించారు. ఈ మొత్తం కార్యక్రమం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మహా యజ్ఞంల కొనసాగుతుందని తెలిపారు.
అనంతరం ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దేవతలు, దీపం , పూజ వస్తువులను లోనికి తీసుకొచ్చిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పణ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుందని తెలిపారు. సంవత్సరానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి , వార్షిక బ్రహ్మోత్సవాలు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.