Kesineni Nani | టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి విరుచుకుపడ్డారు. తిరువూరులో చంద్రబాబు రాజకీయ సమాధికి పునాది పడిందని విమర్శించారు. తిరువూరులో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేశినేని నాని మాట్లాడారు. తిరువూరులో తనపై, స్వామిదాస్పైకి నారా లోకేశ్ గూండాలను పంపించాడని తెలిపారు.
చంద్రబాబు కోసం, టీడీపీ కోసం రూ.2వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని కేశినేని నాని తెలిపారు. చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలని పేర్కొన్నారు. అదే ఏపీ సీఎం జగన్కు పేదవాడి ఆకలి తీర్చి వారిని ధనికులను చేయడం కావాలని తెలిపారు. నారా లోకేశ్ కోసం చంద్రబాబు అమరావతిని నిర్మించాడని పేర్కొన్నారు. కానీ విజయవాడ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. తిరువూరులో స్వామిదాస్ను 20 వేల మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
కాగా, కేశినేని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కేశినేని నానిని ఊసరవెల్లి అని సంబోధించారు. విజయవాడ పరిధిలో ఏ రోడ్డు వేసినా కేశినేని నానికి ముడుపులు కట్టాల్సిందేనని బయటపెట్టారు. ఎంపీ నిధులను గోల్మాల్ చేశారని ఆరోపించారు. 2 లక్షల ఓట్ల తేడాతో కేశినేని నాని ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.