అమరావతి : విజయవాడలో యువతిపై సామూహిక దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ. కోటీ ఇవ్వాలని, బాధితురాలు సంఘంలో గౌరవంగా బతికేందుకు ఉద్యోగం, ఇళ్లు ఇవ్వాలని కోరారు. టీడీపీ తరుఫున రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇవాళ చంద్రబాబు విజయవాడలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలిని టీడీపీ నాయకులు దేవినేని ఉమ, బొండా ఉమ, బోడెప్రసాద్ తదితర నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ నివాసముండే సమీప దూరంలో ఘటన జరిగితే బాధితురాలిని పరామర్శించి ఓదార్చి మహిళలకు భరోసా ఇచ్చి ఉంటే తాము కూడా సీఎంను అభినందించేవాళ్లమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
విజయవాడ ఘటన ఆంధ్రప్రదేశ్కు అవమానమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని, పరిపాలించే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు వల్ల సంఘంలో విద్రోహ శక్తులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలంటే ఇంకెన్ని ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఎవరి ఆస్తులకు రక్షణ లేదని , మహిళలకు అసలుకే రక్షణ లేదని , ఒక్క అవకాశమని రాష్ట్రాన్ని తగలబెట్టుతున్నారని వెల్లడించారు.
దేశంలో ఏపీ డ్రగ్ రాజధానిగా వర్ధిల్లుతుందని బాబు ఆరోపించారు. తిరుమలకు కారులో వెళ్తున్న కుటుంబాన్ని ఒంగోలు నడిరోడ్డులో దించేసి కారును పోలీసులు లాక్కొని వెళ్లారని ఆరోపించారు. పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే స్పందించిన పోలీసులు దిశ యాప్తో స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు.