తిరుపతి : సమాజ ప్రయోజనాల కోసం ఆధునిక శాస్త్రం, ప్రాచీన వేద శాస్త్రాల విజ్ఞానాన్ని కలపాల్సిన అవసరం ఉన్నదని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు. ఆధునిక యుగ శాస్త్రాలకు సంబంధించిన వేదాల్లో పొందుపరిచిన అపారమైన జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం సముచితమన్నారు. తిరుపతిలోని ఎస్వీ వైదిక్ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో సమకాలీన విద్యపై వేద విద్యార్థుల అవగాహన కోసం నిర్వహిస్తున్న మాస విజ్ఞాన వీచిక కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసంగించారు.
జర్మనీకి చెందిన శివ రఘురామ్ వీల్ టెక్నాలజీ గురించి వివరించారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భరద్వాజ మహర్షి బృహద్ విమాన శాస్త్రంలోని 300వ పేజీలోని 84వ, 92వ శ్లోకాలలో ప్రస్తావించారని తెలిపారు. రానునన రెండు-మూడు శతాబ్దాల్లో తరాలకు ఎంతో మేలు చేకూర్చే ఆలోచనలు ఉన్న మన ఋషుల దూరదృష్టిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, మన ఋషులు వివరించిన రుకుమ విమానం, శకున విమానాలకు సహసంబంధమైన చక్రాల సాంకేతికత ప్రాముఖ్యతను ఆయన వివరించారు. చక్రాల సాంకేతికత భవిష్యత్లో ప్రజలకు పర్యావరణ అనుకూలంగా ఉండనున్నదని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజన్, రిజిస్ట్రార్ డాక్టర్ రాధేశ్యాం, డీన్లు డాక్టర్ ఫణియజ్ఞేశ్వరయాజులు, గోలి సుబ్రహ్మణ్య శర్మతోపాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.