తిరుమల : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం తిరుమలకు వచ్చిన మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్యా ఠాక్రే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణం నిమిత్తం కేటాయించిన భూమి పత్రాలను వైవీసుబ్బారెడ్డికి ఠాక్రే అందజేశారు.
నవీ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ భూమి విలువ దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశానికి ముందుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర పాలకమండలి సభ్యుల సమక్షంలో మహారాష్ట్ర మంత్రి ఠాక్రే సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఠాక్రే, సంజీవ్ సరిన్ను సుబ్బారెడ్డి ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ ఆలయం నిర్మాణ వ్యయం మొత్తాన్ని భరించేందుకు సిద్ధమని రేమాండ్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా చెప్పారని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ సరిన్ తెలిపారు. ముంబైలోని అత్యంత విలువైన భూమిని శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వైవీ సుబ్బారెడ్డి.. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రేకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయం నిర్మాణం వ్యవయం భరించేందుకు ముందుకు వచ్చిన రేమాండ్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియాకు కూడా సుబ్బారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.