Srisailam | వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో తగినంత మేరకు వర్షాలు కురిసి రాష్ట్రంతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో శ్రీశైల దేవస్థానం వరుణ హోమాలు, వరుణ జపాలు జరిపించింది. దీంతో వరుణ దేవుడు అనుగ్రహించడం వల్ల తగినంత వర్షాలు కురుస్తాయని ప్రతీతి. గత నెల 26 నుంచి నిర్వహించిన వరుణ జపాలు శనివారంతో ముగిశాయి.
శనివారం వరుణ జపాల ముగింపు సందర్భంగా యాగ పూర్ణహుతి జరిపించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో నూతన వస్త్రాలు, పలు సుగంధ ద్రవ్యాలు యజ్ఒ గుండంలో ఆహుతిగా సమర్పించారు. జపాలు నిర్వహిస్తున్నప్పుడే శ్రీశైలంలో హఠాత్తుగా భారీ వర్షం కురవడం విశేషం. ఈ రోజుల్లో శ్రీశైలంతోపాటు పలు ఇతర చోట్ల కూడా వర్షం కురిసినట్లు తెలుస్తోంది. వరుణ జపాల సమయంలో వర్షం కురవడం పట్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరుణ జపాల పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎస్ లవన్న, స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శివ ప్రసాద్ స్వామి, అధ్యాపక పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేద పండితులు రాధాక్రుష్ణ శర్మ పాల్గొన్నారు. ప్రతి రోజు జరిగిన కార్యక్రమాల్లో పలువురు అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, పండితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.