తిరుపతి : భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పర్వదినాల్లో ఒకటైన వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 5న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై సోమవారం జెఈవో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులు నేరుగాను, వర్చువల్ గాను వ్రతంలో పాల్గొనేందుకు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా టికెట్లు జారీ చేస్తామన్నారు. ఆలయం, ఆస్థాన మండపంలో వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారన్నారు. ఎస్ఈలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రవాణా విభాగాధిపతి శేషారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, విజివో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.