తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సందర్భంగా తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో భక్తులు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy ) తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ సందర్భంగా భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.
టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ నిర్దేశిత సమయం కంటే 45 నిమిషాలు ముందుగా శనివారం ఉదయం 5.15 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించామని తెలిపారు. ఆ తరువాత స్లాట్ల వారీగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నామని వివరించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు అందిస్తున్నామని చెప్పారు.
తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ సజావుగా జరుగుతోందన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం కలిపి రోజుకు దాదాపు 70 వేల మందికి, 10 రోజుల్లో కలిపి దాదాపు 8 లక్షల మందికి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.