తిరుమల: తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకున్నది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో వేదపండితులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. పూజల అనంతరం 1.45 గంటల నుంచి స్వామివారు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 9 గంటలకు స్వర్ణ రథంపై శ్రీవారు దర్శనమిస్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరిన జస్టిస్ ఎన్వీ రమణకు ఆలయ అధికారులు, టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. వారికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.
అదేవిధంగా మంత్రి హరీశ్రావు దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా స్వామి సేవలో పాల్గొన్నారు.