Srisailam | ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. శనివారం వేకువజామున శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజాదికాలు, రావణ వాహన సేవ జరిపించారు. ఉదయం మూడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయిద్యాల తర్వాత 3.30 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాత:కాల పూజలు జరిపించారు. 4.30 గంటలకు స్వామి వారికి, తర్వాత అమ్మవారికి మహా మంగళ హారతులు జరిపించారు.
మహా మంగళ హారతుల తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ఉత్తరముఖంగా వేంచేబు చేయించి విశేష పూజాదికాలు జరిపించారు. తొలుత లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ స్మామి అమ్మవార్లకు అర్చక స్వాములు, వేద పండితులు ఉత్సవ సంకల్పం పఠించారు.
ఈ ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పాడి పంటలు సమ్రుద్ధిగా ఉండాలని, దేశంలో సుఖ శాంతులు విలసిల్లాలని, జనులందరికీ సుఖ సంతోషాలు కలగాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని ప్రార్థించారు.
అనంతరం ఉత్సవ పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థిస్తూ మహా గణపతి పూజ జరిపించారు. మహా గణపతి పూజ తర్వాత శ్రీ స్వామి అమ్మార్ల ఉత్సవ మూర్తులకు పూజాదికాలను జరిపించారు. తదుపరి ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సమ మూర్తులను స్వామి వారి ఆలయ ముఖ మండప ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు తోడ్కొని వచ్చి ఆలయ ఉత్తర భాగంలోనే రావణ వాహనంపై ఆశీసులను చేయించి రావణ వాహన సేవ జరిపించబడింది. తర్వాత రావణ వాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం జరిపించారు.
శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రారంభమైన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. గ్రామోత్సవం తర్వాత కూడా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దర్శించడానికి వీలుగా ఉత్సవ మూర్తులను ఆలయ ముఖ మండపం ఉత్తర దిక్కున (బలపీఠం సమీపంలో) వేంచేబు చేయించారు.
ఈ ఉత్సవంలో శ్రీశైలం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు, శ్రీ స్వామి అమ్మవార్ల ప్రధాన అర్చకులు హెచ్ వీరయ్య స్వామి, అమ్మవారి అర్చకులు-వేద పండితులు గంటి రాధాక్రుష్ణ శర్మ, అధ్యాపక పూర్ణానందర ఆరాధ్యులు, సహాయ ఈఓ ఐఎన్వీ మోహన్, సూపర్ వైజర్ బీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.