Srisailam | భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం వడ ప్రసాదం అందుబాటులోకి తెచ్చింది. ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద లడ్డూ, పులిహోరలతోపాటు వడ ప్రసాదం కూడా కొనుగోలు చేయొచ్చునని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. 45 గ్రాముల వడ ప్రసాదం ధర రూ.20గా నిర్ణయించారు. శుక్రవారం నుంచి వడ ప్రసాదం విక్రయం ప్రారంభించారు. తొలుత ఈవో ఎస్ లవన్న.. వడ ప్రసాదం కొనుగోలు చేసి వాటి విక్రయాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఈఓ లవన్న మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు వడ ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని సంబంధిత విభాగం సిబ్బందిని,అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదాల విక్రయ విభాగపు పర్యవేక్షురాలు పీ దేవిక, గుమస్తా జీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
లోక కల్యాణం కోసం కృతిక నక్షత్రం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి) కి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృతికా నక్షత్రం, షష్టి తిథి రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి దేవస్థానం సేవగా విశేష అభిషేకం, పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
కుమార స్వామికి పూజలు చేయడం వల్ల లోక కల్యాణమే కాక ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆటుపోట్లు తగ్గి ఆయా పనులు సక్రమంగా సాగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు తదితరాలు తొలగిపోతాయి. సంతానం కోసం పూజలు చేసే వారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరక్కుండా చూడాలని, జనులంతా సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకులు, వేద పండితులు సంకల్పం పఠించారు.
తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహా గణపతి పూజ నిర్వహించారు. అటుపై శ్రీసుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అర్చన, సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేశారు. పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, దానిమ్మ, కమల, ద్రాక్ష, అరటి తదితర ఫలాల రసాలతో సుబ్రహ్మణస్వామికి అభిషేకం చేశారు. ముఖ్యంగా వివిధ పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.