అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రగతి తెలుసుకునే వీలుంటుందని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెఖావత్ సూచించారు. 15 రోజులకోసారి మూడు నెలల పాటు సమీక్షించునున్నట్లు చెప్పారు. పీపీఏ అధికారులతో పాటు పోలవరం అధికారులంతా ఈ సమీక్షకు హాజరవ్వాలని, నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలన్నారు. ఏపీ సీఎం జగన్తో కలిసి కేంద్ర మంత్రి షెఖావత్.. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. అక్కడి నుంచి వ్యూపాయింట్కు చేరుకుని పనులు జరుగుతున్న తీరును గమనించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు సాఫీగా, వేగంగా పూర్తయ్యేందుకు కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహాయసహకారాలు ఉంటాయిని కేంద్ర మంత్రి షేఖావత్ తెలిపారు. ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చయ్యే ప్రతీ పైసా కేంద్రమే భరిస్తుందని మరోసారి వెల్లడించారు. నిధుల సమస్య రాకుండా ఉండేందుకు పనులకు సంబంధించిన అన్ని వివరాలను కేంద్రం వద్ద నమోదు చేయాలని ఆయన సూచించారు.
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్), డయా ఫ్రమ్ వాల్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల ప్రగతి, నిర్వాసితులకు పునరావాసంపై రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ చేయాలని సీఎం జగన్ కోరగా.. చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, రూ.2,616 కోట్లను రీయింబర్స్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.