అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. నంద్యాల జిల్లాలో మిద్దెకూలి మహిళ (Women) మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల (Highways) పై ఎటు చూసినా వరద చేరిపోవటంతో రాకపోకలు సాగించలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.
అనంతపురం (Anantapuram) జిల్లా కూడేరు , విడపనకల్లు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పెంచులపాడు , ఆర్.కొట్టాల, పొలికి, గడేకల్లు, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. పలు మండలాల్లో పొలాల్లో చీనీ, దానిమ్మ పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
మంత్రాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం భారీ వర్షాలకు చెరువును తలపిస్తోంది. భారీ వర్షం కారణంగా భక్తుల ఇబ్బందులను గుర్తించిన మంత్రాలయం పీఠాధిపతి సుబుదేందు తీర్థులు మఠంలో ఆశ్రయం కల్పించారు. కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డు కల్వర్టు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోకి వరద ప్రవేశించింది.
నంద్యాల (Nandyala) జిల్లా వెలుగోడు పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో మిద్దెకూలి మద్దమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలకు ఏజెన్సీ(AGency Areas) లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లక్ష్మీపురం, బుంగపుట్టు, ముంచంగిపుట్టు మండలాల నుంచి పంచాయతీలకు వెళ్లే మార్గంలో గడ్డ పొంగి ప్రవహిస్తుంది.