AP News | నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసమ్మతి గళం భగ్గుమన్నది. ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ బొల్లినేని రామారావు తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఎన్ఆర్ఐ సురేశ్కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుచరులతో గురువారం ప్రత్యేకంగా సమావేశమైన ఆయన తన బాధనంతా బయటపెట్టారు. ఈ సందర్భంగా బొల్లినేనికి అన్యాయం జరిగిందని ఆయన అనుచరవర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కనిగిరిలో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బొల్లినేని.. ఉదయగిరి అభ్యర్థి విషయంలో చంద్రబాబు నిర్ణయంతో కలత చెందానని తెలిపారు. తనకు టికెట్ రావడం లేదని తెలిసి చంద్రబాబును అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డా.. టికెట్ రానందుకు బాధగా లేదని.. చంద్రబాబు చూసిన విధానమే తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏండ్లుగా ఉదయగిరి ఇన్ఛార్జిగా పనిచేశానని.. టీడీపీ క్యాడర్ మద్దతు తనకే ఉందని తెలిపారు. కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. వాళ్ల అభిప్రాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కచ్చితంగా ఉదయగిరిలో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబును కలుస్తానని తెలిపారు. చంద్రబాబు వద్దు అన్నా పోటీ చేయడం ఖాయమని కుండబద్దలుకొట్టారు. టీడీపీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో బ్రోకర్లు టికెట్లు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు.