విజయనగరం: బాలికల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన దారుణం విజయనగరం ఏజెన్సీలో జరిగింది. ఈ విషాద ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్నది. ఈ ఘటనపై స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం.. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యా శాఖ మంత్రి సూచించారు.
విజయనగరం ఏజెన్సీలోని బాలేసు పాఠశాలలో ఇద్దరు బాలికను ఉపాధ్యాయులు లైంగికంగా వేధించిన సంఘటన దుమారం రేపుతుననది. ఈ ఘటనపై ఏజెన్సీవాసులు భగ్గుమనడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. లైంగికంగా వేధించిన ఉపాధ్యాయులు స్వామినాయుడు, సూర్యనారాయణలను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. వెంటనే వారిని సస్పెండ్ చేసి విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ అనంతరం క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల శరీరాన్ని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఇద్దరిని సస్పెండ్ చేస్తూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.