అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) హఠాన్మరణం పట్ల ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. సోమవారం ఉదయం హైదరాబాద్లో ఆయనకు గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి లోపలకి వచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు.
మంత్రి మృతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్ , తదితర నాయకులు సంతాపం తెలియజేశారు.