అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకూరి మండలం సూదివారి పాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు నీటికుంటలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు వివరాలు ప్రకారం.. సూదివారిపాలెం ఎస్టీ కాలనీకి చెందిన పాలపర్తి శివరాజు (9) , పాలపర్తి ప్రతాప్(7) ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.
రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లి వచ్చి ఆడుకునేందుకు నాగండ్ల రోడ్డు వైపు ఉన్న నీటి కుంటను చూసి ఈత కొట్టడానికి అందులో దిగారు. దీంతో కుంట లోతుగా ఉండడంతో ఇద్దరు నీటమునిగిపోయారు. అటుగా వెళుతున్న వారు గమనించి ఇరువురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వివరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.